తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం భద్రాచలం నుండి ఏటూరు నాగారం దిశగా హెలీకాప్టర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ, సీఎం కేసీఆర్ ముందుగా ఏటూరునాగారంలోని రామన్నగూడెం చేరుకున్నారు. రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి తల్లికి సీఎం కేసీఆర్ సారె సమర్పించి, శాంతి పూజలు నిర్వహించారు.
అనంతరం అక్కడి పునరావాస కేంద్రానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ముంపు బాధితులను పరామర్శించారు. భవనంలోని ప్రతి బాధితుడినీ కలుస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అధికారుల నుంచి వారికి అందుతున్న సహకారం, పునరావాస ఏర్పాట్లు, భోజన వసతులపై సీఎం ఆరా తీశారు. వరద తగ్గే వరకూ పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని ప్రకటించారు. ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్ లో వరద ముంపుతో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత నిర్మాణాలు చేపడతామని సీఎం కేసీఆర్ బాధితులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ,‘‘వరదలు వచ్చినప్పుడల్లా రామన్నగూడెంలో నష్టం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ కాలనీలను పరిశీలించడం జరిగింది. గతంలో మాదిరి కాకుండా ఈ ప్రాంతానికి వరద ముంపు రాకుండా, ఇబ్బంది లేకుండా శాశ్వతంగా తగు చర్యలు తీసుకుంటాం. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. వరదల్లో ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని అన్నారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులందరూ వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి, చర్యలు తీసుకుంటారని బాధితులకు భరోసానిచ్చారు. వరద ప్రమాదం నుంచి ప్రజలను బయటపడేసిన ప్రజా ప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. రామన్నగూడెం పునరావాస కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సీఎం తిలకించారు.
అనంతరం ఏటూరు నాగారంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నెలాఖరు వరకూ భారీ వర్షాలుంటాయన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంత పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రతి శాఖ అధికారులు మూడు షిఫ్టులుగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సీఎం అన్నారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని, కానీ ఇప్పుడు ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్ ను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరదతో చాలా చోట్ల మిషన్ భగీరథ పైపులు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరినందున దీన్ని వెంటనే మంజూరు చేస్తున్నామని సీఎం ప్రకటించారు.
వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సహాయం కింద ప్రత్యేకంగా నిధులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాకు రూ.2 కోట్ల 50 లక్షలు, భద్రాచలం జిల్లాకు రూ.2 కోట్ల 30 లక్షలు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్ కు రూ.1 కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు. వర్షాలతో వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగు జిల్లా కేంద్రంలో ఒక హెలీకాప్టర్ ను, భద్రాచలంలో మరొక హెలీకాప్టర్ ను సిద్ధంగా ఉంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. కరెంట్ సౌకర్యాన్ని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు.
పక్కాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నాం. శ్యాంపల్లి ఆర్ అండ్ బీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలని, వరద ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని సీఎం కేసీఆర్ అన్నారు. నిధులు ఎక్కువ ఖర్చయినా సరే, నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు. ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే పారిశుధ్య పనులను చేపట్టాలని ఆదేశించారు. ‘‘మనందరం ప్రజల కోసమే పనిచేయాలి. ఏ ఒక్కరినీ ఏమీ అనవద్దు. అటవీశాఖ అధికారులు పనుల ఇబ్బందుల పేరు మీద ఏమాత్రం ఇబ్బంది పెట్టవద్దు.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. కాగా ఏటూరునాగారంలో డయాలసిస్ సెంటర్ ను వెంటనే ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY