తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 28, ఆదివారం నాడు దివంగత మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఏడాది పొడవునా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.
“భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1921 జూన్ 28 న తెలంగాణలో జన్మించారు. ఆదివారం నుంచి పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను జరుపుకుంటున్నాము. 1991 లో వచ్చిన ఆర్థిక సంక్షోభం సమయంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన నాయకుడిగా పీవీ ప్రసిద్ది చెందారు. అదే సమయంలో పీవీ భారతదేశపు బహుముఖ ప్రజ్ఞావంతుడైన బిడ్డ. అనేక ఇతర కీలకమైన రంగాలలో కూడా మన దేశం యొక్క వృద్ధికి ఆయన దోహదపడ్డారు. మొదట రాష్ట్ర స్థాయిలో రెసిడెన్షియల్ పాఠశాలలు, తరువాత జాతీయ స్థాయిలో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల నుండి, పేద కుటుంబాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి పీవీ పేరు పెట్టాలని తెలంగాణలో ప్రజల నుంచి డిమాండ్ ఉంది. యాదృచ్ఛికంగా, తెలంగాణలో విద్యా మౌలిక సదుపాయాల అసమతుల్యతను పరిష్కరించడానికి సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం ఆ సమయంలో తెలంగాణ ఆందోళన ఫలితంగా హైదరాబాద్ యూనివర్సిటీ 1974 లో స్థాపించబడింది. ఈ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ అని పేరు పెట్టాలని మీ కార్యాలయం ద్వారా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. పీవీ శతజయంతి ఉత్సవాలు జరుపుకొంటున్న ఈ సమయంలో ఇదే ఆయనకు ఘనమైన నివాళి” అని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu