కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి చేస్తున్న ప్లాస్మా థెరపి మంచి ఫలితాలను ఇస్తున్నందున, కోవిడ్ నిరోధక యాంటీ బాడీలు సరైన మోతాదులో ఉన్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని గవర్నర్ సూచించారు. జూలై 18, శనివారం నాడు సనత్ నగర్ లోని ఈఎస్ఐ మెడికల్ కళాశాలలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్లాస్మా బ్లడ్ బ్యాంక్ ను గవర్నర్ సందర్శించారు. అక్కడ కోవిడ్-19 చికిత్స కోసం వారి సన్నద్ధతను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ నుండి కోలుకున్న అందరి నుండీ ప్లాస్మా తీసుకోలేమని, కోలుకున్న వారిలో సరైన మొత్తంలో సరిపడా యాంటీబాడీలు ఉన్నవారు మాత్రమే ప్లాస్మా దానానికి అర్హులని డా. తమిళిసై వివరించారు. “ప్లాస్మా దానంపై ఎలాంటి అపోహలు, భయం అవసరం లేదు. ఇది ఆరోగ్యకరమైనదే” అని గవర్నర్ వివరించారు. ఒక గవర్నర్ గా కాకుండా, ప్రజల సేవలో ఒక ఉత్ప్రేరకంగా భావిస్తూ పనిచేస్తానని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రధమ పౌరురాలిగా కాకుండా సామాన్యులలో ఒకరిగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో ప్రభుత్వానికి, ప్రజలకు వారు చేసే కృషిలో తోడుగా ఉంటానని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోవిడ్-19 నుండి కోలుకుని ప్లాస్మా దానం చేసిన సంతోష్ అనే వ్యక్తిని గవర్నర్ అభినందించారు. అలాగే మెడికల్ కాలేజ్ డీన్ డా. శ్రీనివాసరావు కోవిడ్ నుండి కోలుకుని సేవలందించడంలో ముందుండటంలో ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu