కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు జరగనున్న (అక్టోబర్ 30) ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. హుజురాబాద్ జూనియర్ కాలేజిలో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామాగ్రితో శుక్రవారం సాయంత్రానికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 1715 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. అలాగే మొత్తం 2,37,036 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మరోవైపు ఈ ఉప ఎన్నికను పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్ కెంద్రంలో ఓటర్లకు హెల్ప్ డెస్క్, మాస్కులు, శానిటైజర్, థర్మామీటర్ తో టెంపరేచర్ పరీక్ష చేయడం, భౌతిక దూరం అమలు చేయడం వంటి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆలాగే కోవిడ్ రోగులకు ఓటు హక్కు వినియోగించుకునే పిపిఈ కిట్లను సమకూర్చడంతో పాటుగా, ఎక్కువ టెంపరేచర్ తో బాధపడే వారికి పోలింగ్ చివరి సమయంలో ఓటు హక్కు వినియోగించుకొనుటకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక ఈ ఉపఎన్నికలో ప్రజలు శాంతియుత వాతావరణంలో స్వేచ్చగా తమ ఓటు హక్కుని వినియోగించుకొనుటకు 3,865 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో 20 కంపెనీల కేంద్ర బలగాలు సహా ప్రత్యేక పోలీసులు, జిల్లా పోలీసులు, ఇతర జిల్లాల నుండి పోలీసులను కూడా ఎన్నికల బందోబస్తు కోసం నియమించారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. హుజురాబాద్ లో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రజలతో మమేకమై తమ ప్రచారంతో హోరెత్తించారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో పాటుగా విమర్శలు, సవాళ్లుతో సాగడంతో ఈ ఉపఎన్నికపై రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకుంది. రేపు పోలింగ్ నిర్వహించి, నవంబర్ 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఎక్కువగా చర్చ జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజా తీర్పు ఎవరివైపు ఉండబోతుందో మరికొన్ని రోజులు వేచిచూడాలి.
హుజూరాబాద్ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే:
- బీజేపీ – ఈటల రాజేందర్
- టీఆర్ఎస్ – గెల్లు శ్రీనివాస్ యాదవ్
- కాంగ్రెస్ – బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు
హుజూరాబాద్ ఉపఎన్నిక వివరాలు:
- పోలింగ్ తేదీ : అక్టోబర్ 30
- మొత్తం ఓటర్లు : 2,37,036
- పురుష ఓటర్లు : 1,17,933
- మహిళా ఓటర్లు : 1,19,102
- పోలింగ్ కేంద్రాలు : 306
- పోలింగ్ సిబ్బంది : 1715
- పోలింగ్ సమయం : శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు
- ఫలితాలు వెల్లడి : నవంబర్ 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ