కుటుంబ నేపథ్యం ఏదైనా పట్టుదల, వ్యూహం ఉంటే సివిల్ సర్వీసెస్ సాధించటం సాధ్యమేనని ఇటీవల ఎంపికైన అభ్యర్థులు నిరూపించారు. 2021లో సివిల్స్ సాధించిన వారిని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఉస్మానియా యూనివర్శిటీతో కలిసి ఘనంగా సత్కరించింది. ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. సివిల్స్ విజేతలు తమకు ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థులతో పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను సైతం సివిల్స్ సాధించేలా ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవిందర్ యాదవ్ అన్నారు. త్వరలోనే అన్ని సౌకర్యాలతో ఉస్మానియా విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ అకాడమీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. “విద్యార్థిగా చేరండి సివిల్ సర్వెంట్ గా వెళ్లండి” అనే నినాదంతో ప్రణాళిక అమలు చేయనున్నట్లు చెప్పారు.
వచ్చే ఏడాది ఫలితాల్లో కనీసం పది నుంచి పదిహేను మంది ఉస్మానియా విద్యార్థులు సివిల్స్ సాధించి ఈ వేదిక ద్వారా మాట్లాడాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విద్యార్థులకు పిలుపునిచ్చారు. సివిల్స్ 2వ హబ్ గా హైదరాబాద్ మారుతుందన్నారు. భిన్న నేపథ్యాల నుంచి సివిల్స్ సర్వీసెస్ సాధించి చూపిన అభ్యర్థుల జీవితాలు విద్యార్థులు ప్రేరణగా తీసుకోవాలని ఆయన సూచించారు. 2021లో సివిల్స్ ర్యాంకులు సాధించిన 20 మంది అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నేపథ్యాన్ని, సివిల్స్ సాధించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. ప్రణాళిక, వ్యూహం ఉంటే సివిల్స్ సాధించవచ్చని తనకు 25 సంవత్సరాలు నిండే వరకు సివిల్స్ సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని సాధించినట్లు శరత్ నాయక్ అన్నారు. తొమ్మిదో తరగతిలోనే తాను ఐఏఎస్ అవ్వాలని నిర్ధేశించుకున్నట్లు తెలిపారు. తీవ్ర వైకల్యంతో బాధపడుతూ నడవలేని, రాయలేని స్థితిలో స్మరణ్ రాజ్ సివిల్స్ సాధించాడు. బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ఒకవైపు శరీరం చచ్చుబడిపోయినా పట్టుదలతో సివిల్స్ సాధించానని గద్గద స్వరంతో స్మరణ్ రాజ్ వివరించారు. అమ్మ, అమ్మ భాష, పట్టిన నేల అనే సూత్రాన్ని తాను ఎప్పుడూ పాటిస్తానని అన్నారు.
మత్స్యకార కుటుంబంలో పుట్టి అనేక ఆటుపోట్ల మధ్య తాను సివిల్స్ సాధించానని అశోక్ వెల్లడించారు. సివిల్స్ సాధించేందుకు ఎలాంటి నోట్స్ రాసుకోవాలో వివరించారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే సివిల్స్ లో 56వ ర్యాంకు సాధించానని కిరణ్మయి చెప్పుకొచ్చారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే సొంతంగా చదవి ర్యాంకు సాధించానని అమిత, రంజీత్ వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మాట్లాడే అవకాశం రావటం సంతోషంగా ఉందని అన్నారు. ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రెజెంటేషన్ ద్వారా సివిల్స్ సాధించానని జనీత్ చంద్ర అన్నారు. అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే కుటుంబ నేపథ్యాలు అవసరం లేదని, ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి.మల్లేశం అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు యూనివర్శిటీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ బి.రెడ్యా నాయక్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.అలోక్ కుమార్, ఓయూ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, మైనారిటీ సెల్ డైరెక్టర్ డాక్టర్ సయ్యెదా అజీమ్ ఉన్నీసా, ఆయా విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY