ఏంటీ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. కేసీఆర్ దొర అహంకారానికి చెక్ పెట్టేదీ మేమే.. అని భారతీయ జనతా పార్టీ చెబుతుంటే.. ఒక్కో నియోజకవర్గానికి 20 నుంచి 40 మంది ఆశావహులు ఎమ్మెల్యే టికెట్ కు దరఖాస్తు చేసుకుంటే.. బరిలో లేనట్లేనా అంటారా.. అని ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పోరాటంలో ఆ పార్టీ కనబరుస్తున్న అలసత్వం.. అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం.. చూస్తే వ్యవహారం అదే చందాన కనిపిస్తోంది. సాక్షాత్తూ ప్రధానమంత్రే రెండు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు తెలంగాణలో ప్రచారానికి వచ్చినా.. ఆసక్తికర కామెంట్లు చేసినా పార్టీలో ఎక్కడా ఊపే లేదు. ఎన్నికల రణక్షేత్రానికి సంబంధించి.. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్రెడ్డికి ముందు.. ఆ తర్వాత.. పరిశీలిస్తే.. ఫైర్ విల్ బి ఫైర్.. ఐయామ్ ఫైర్.. ఐయామ్ ఫైర్ స్థాయి నుంచి.. వి ఆర్ లేట్ ఫర్ ఫైట్ అనేలా మారింది.
ఎన్నికలు షెడ్యూల్ విడుదలైనా.. బీజేపీలో ఎన్నికల సమరోత్సాహం కనిపించడం లేదు. ఆలస్యం.. మా వ్యూహం అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వింత పలుకులు పలుకుతూ.. కొత్త భాష్యాలు చెబుతున్నారు. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నెలరోజులు దాటుతున్నా ఇప్పటివరకు వాటిపై వడపోత లో వేగం పెరగడం లేదు. ఓ వైపు బీఆర్ఎస్ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా దరఖాస్తులు స్వీకరించగా.. రేపో.. ఎల్లుండో తొలి విడుత అభ్యర్థుల జాబితాను ప్రకటించే చాన్స్ ఉంది. ఈ రెండు పార్టీలు జోరుమీదుంటే బీజేపీ మాత్రం అభ్యర్థుల స్క్రూటినీ ప్రారంభించకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
ప్రజల్లో బీజేపీ జోష్ తగ్గినప్పటికీ.. పార్టీలో ఆశావహుల జోష్ మాత్రం బాగానే ఉంది. చాలా నియోజకవర్గాలకు 20 నుంచి 40 వరకు దరఖాస్తులు వచ్చాయి. కానీ పార్టీ అధిష్ఠానం మాత్రం వాటిని ఇంకా నియోజకవర్గాల వారీగా పరిశీలన జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. మొదటి జాబితా కూడా కొలిక్కి రావడం లేదు. ఎన్నికలకు ఇంకా నెలనర్నర సమయం మాత్రమే ఉంది. వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. అయినప్పటికీ పార్టీ అధిష్ఠానం అభ్యర్థలు ఎంపిక విషయంలో వేగం పెంచడం మాని.. ఆలస్యం అవుతుంది.. అది వ్యూహాత్మకంగా అంటోంది. త్వరగా తేల్చకపోతే.. ప్రచారానికి సమయం చాలదని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటివరకు బీఆర్ఎ్సకు ప్రత్యామ్నాయంగా సాగిన బీజేపీలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని ఇప్పటికే నాయకులు వాపోతున్నారు.
ఆలస్యం.. మా వ్యూహమని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలోనే కాదు.. రాజకీయాల్లోనే చర్చ జరుగుతోంది. ఎన్నికల రేసులో అన్ని పార్టీల కంటే ముందు ఉండాల్సిన తరుణంలో స్టేట్ మెంట్లు ఇవ్వడం బీజేపీ నేతలను కలవరపడుతోంది. ఇలా వేచి ఉండడానికి చాలా కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. చాలా నియోజకవర్గాలకు అధిక సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చినా.. బీఆర్ ఎస్ అభ్యర్థులను ఎదుర్కొనేలా ఆర్థికంగా, సామాజికంగా బలమైన వారు లేరనే ప్రచారం ఉంది. అలాగే.. కాంగ్రెస్ జాబితా విడుదల తర్వాత టికెట్లు రాని అసంతృప్త నేతలను తమవైపు తిప్పికోవాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఒకే ఒక స్థానం గోషామహల్. ఇక్కడ రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఏడాది కిందట ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు ఆ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఆయనకు టికెట్ ఇస్తారా ? వేరేవారికి కేటాయిస్తారా ? అన్న ఉత్కంఠ నెలకొన్నది. ఇక్కడ పార్టీ బలంగానే ఉంది. రాజాసింగ్కు కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తే పార్టీ పరిస్థితి ఏమటనేది సందిగ్దం చోటు చేసుకుంది. అలాగే రాజధానిలోని గతంలో గెలిచిన స్థానాలు కాకుండా, పట్టున్న స్థానాలపై కమలనాథులు కన్నేశారు. 2014లో గెలిచిన ఖైరతాబాద్, అంబర్పేట, ఉప్పల్, ముషీరాబాద్ స్థానాలను గెలవాలనే యోచనలో పార్టీ నాయకులున్నారు. అలాగే మల్కాజిగిరి, కార్వాన్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను దింపాలని యోచిస్తున్నారు. అంగబలం, అర్థబలం ఉన్న నాయకులను బరిలోకి దింపడంతోపాటు ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE