ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్న నేపధ్యంలో అక్కడ ఉన్న అవసరాలు, సమస్యలపై హాస్పిటల్ సూపరింటెండెంట్ లతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులపై కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లను ఆదేశించారు. ముందుగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై మంత్రి సమీక్షించారు. ఏజన్సీ ప్రాంత హాస్పిటల్ డాక్టర్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్ లో కరోనా పేషంట్లను వేరే హాస్పిటల్స్ కి తరలించి, అక్కడ సీజనల్ వ్యాధులకు చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలోనున్న అన్ని ఆసుపత్రిలలో సీజనల్ వ్యాధులకు మందులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. సీజనల్ వచ్చే దగ్గు, జ్వరాలను కరోనా జ్వరాలుగా పొరపాటు పడి ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకి మరింత అవగాహన కల్పించాలని మంత్రి కోరారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలని సూపరింటెండంట్ లకు మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో పూర్తి స్థాయిలో కరోనా చికిత్స అందించాలని సూచించారు. జిల్లా ఆసుపత్రుల్లో – తక్కువ లక్షణాలున్న వారందరికీ చికిత్స అందించాలి. పాజిటివ్ ఉండి లక్షణాలు లేనివారికి హోమ్ ఐసొలేషన్ లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఏ కొరత ఉండకుండా చూడాలనీ, ఏది కోరితే అది గంటల్లో అందిస్తాం అని మంత్రి హామీ ఇచ్చారు.
అలాగే మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి క్వార్టర్స్ లోనే ఉండి అందుబాటులో ఉంటున్నందుకు ప్రత్యేకంగా ఆయనను మంత్రి అభినందించారు. అన్ని జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు కూడా జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. 99 మందికి మంచి చికిత్స అందించి ఒక్కరికి అందిచకపోయినా చెడ్డ పేరు వస్తుంది అందుకే అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఖండించాలని ఆదేశించారు. కరోనా సోకిన వారికి సకాలంలో చికిత్స అందిస్తే వారి ప్రాణాలు నిలబడతాయి కాబట్టి హాస్పిటల్ కి వచ్చిన పేషంట్ ను ఏ కారణం చేత కూడా తిప్పి పంపించవద్దు అని కోరారు. అత్యవసర పరిస్థితి ఉన్నవారిని గాంధీ కి పంపించాలని తెలిపారు. ఇంటిదగ్గర ఉండే అవకాశం ఉన్న వారినీ మాత్రమే హోమ్ ఐసొలేషన్ కి పంపించాలని సూచించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు నర్సులు అన్నం తినిపిస్తున్నారు. అలాంటి మానవత్వం ఇప్పుడు అవసరం. ఈ సేవ మీకు పుణ్యం అందిస్తుంది అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, గాంధీ ఆసుపత్రి సూపరింటండెంట్ డాక్టర్ రాజారావు, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu