సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ను జూన్ 12న నిర్వహించనున్నామని, ట్రయల్ రన్ పూర్తయితే హుస్నాబాద్కు జలకళ వస్తుందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం మేరకు నిండితే హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం అవుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పందిళ్ల గ్రామంలో మంగళవారం శ్రీ స్వయం భూ రాజేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన వాసవీ నిత్యాన్నదాన సత్రాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితెల సతీష్తో కలసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రాంతంలోని కరువు పీడిత ప్రాంతాలకు గౌరవెల్లి ప్రాజెక్టు ఒక వరంలా ఉంటుందన్నారు. ఇక ఈ రిజర్వాయర్ ద్వారా కరీంనగర్, వరంగల్, జనగాం జిల్లాల్లోని నియోజకవర్గాల పరిధిలో గతంలో 1.2 లక్షల ఎకరాలకు సాగునీరందించే విధంగా దీనిని చేపట్టారని, అయితే సీఎం కేసీఆర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 9 టీఎంసీలు తాగు నీటికి, 1.6 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరందించేలా రీడిజైన్ చేశారని గుర్తుచేశారు. అలాగే మిడ్ మానేరు వరద కాలువ కాదని, లైవ్ కెనాల్ అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పేదవారికి ఉపయోగపడేలా రాజేశ్వర ట్రస్ట్ వాసవీ నిత్యాన్నదాన సత్రానికి శాశ్వత నిధిలో భాగస్వామిగా తన నెల వేతనాన్ని ట్రస్టుకు అందిస్తున్నానని మంత్రి ప్రకటించారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామని, అలాగే రూ. 10 కోట్ల నిధులు వెచ్చించి 50 పడకల సామర్ధ్యం కల మాతా, శిశు సంక్షేమ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని తండాలకు త్వరలోనే రోడ్లు మంజూరు చేస్తామని, తండాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF