రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సోమవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. మళ్ళీ పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో వాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించడంతో మొదటి డోసు వ్యాక్సినేషన్ లక్ష్యం దాదాపుగా వంద శాతానికి చేరువ అయిందని, ఇదే స్ఫూర్తితో రెండో డోసు కూడా వంద శాతం అయ్యేలా కృషి చేయాలన్నారు.
జనవరి 3 నుండి 15-18 వయస్సు వారికి కరోనా వాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి:
మరోవైపు 15- 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ తో పాటుగా హెల్త్ కేర్, ప్రంట్ లైన్ వర్కర్స్, 60 ఏళ్లు పైబడి కొమార్బిడీటిఎస్ తో బాధపడే వారికి మూడోదైన ప్రికాషన్ డోస్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో 15-18 ఏళ్ల వారు 22.78 లక్షలు, 60 ఏళ్లపైబడిన వారు 41.60 లక్షలు, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ 6.34 లక్షలు ఉన్నారని, వీరందరికీ దాదాపు 70 లక్షల వ్యాక్సిన్ అవసరం ఉంటుందని చెప్పారు. జనవరి 3 నుండి 15-18 వయస్సు వారికి, జనవరి 10 నుండి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక కరోనా మూడో వేవ్ వచ్చినా కూడా పూర్తిస్థాయిలో ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలని, ఇప్పటికే చేసిన ఏర్పాట్లను విభాగాల వారీగా సమీక్షించుకోవాలని, ఇంకా అవసరమైన అదనపు చర్యలు అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్ రావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎం ఓఎస్డి గంగాధర్, టీఎస్ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ