వచ్చే పది సంవత్సరాల్లో హైదరాబాద్ ను ఆసియాలోనే అగ్రగామి లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రయత్నం చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. రానున్న పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ కి భారీ పెట్టుబడులను ఈ రంగంలో ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన రూపొందించిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్- 2030 నివేదికను మంగళవారం నాడు మంత్రి కేటిఆర్ ఆవిష్కరించారు. ముందుగా ప్రగతి భవన్ లో మంత్రి కేటిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ సలహా కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో సభ్యులుగా ఉన్న ఫార్మా కంపెనీల అధిపతులు, ఫార్మా నిపుణులు, విద్యా సంస్థల అధిపతులు పలువురు ఈ సమావేశానికి హాజరై తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన పరిస్థితులతో పాటు భవిష్యత్తులో ఈ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల పైన విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా వీరంతా రానున్న పది సంవత్సరాల్లో ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడుల ఆకర్షణ మరియు ఉద్యోగాల కల్పన దిశగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంతో పాటు ప్రభుత్వం నుంచి పరిశ్రమ ఆశిస్తున్న చర్యలపైన మంత్రి కేటిఆర్ కు వివరించారు. వీటన్నిటిపైన సానుకూలంగా స్పందించిన మంత్రి కేటిఆర్ భవిష్యత్తులోనూ ఫార్మా రంగం పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధిలో ప్రభుత్వ ప్రాధాన్యతా రంగంగా కొనసాగుతుందని తెలియజేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలోని భాగస్వాములతో పాటు, పెట్టుబడిదారులు, అకాడమీ(విద్యారంగ నిపుణులు), సలహాదారులు, ప్రభుత్వ అధికారులు మరియు ఇతర అనుబంధ సంస్థలతో విస్తృతంగా చర్చించి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపారు. ఈ నివేదిక ప్రభుత్వానికి పాలసీపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటిఆర్ అన్నారు. రానున్న పది సంవత్సరాల్లో తెలంగాణను ఆసియాతో పాటు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన లైఫ్ సైన్సెస్ పెట్టుబడి గమ్యస్థానంగా మలిచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కోసం కలిసివచ్చిన లైఫ్ సైన్సెస్ భాగస్వాములు అందరికీ ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ