కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం నాడు ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 1, 2022 నుండి టెక్స్టైల్స్ మరియు చేనేత రంగంపై జిఎస్టీని 5 శాతం నుండి 12 శాతానికి సవరించే ప్రణాళికలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్స్ చేశారు. గత కొన్ని వారాలుగా చేనేత, జౌళి పరిశ్రమ మరియు లక్షలాది నేత సంఘాలు చేనేత ఉత్పత్తులు మరియు దాని ముడిసరుకుపై జిఎస్టీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అనేక నిరసనలు నిర్వహించాయన్నారు. ఇటీవలి కాలంలో ముడిసరుకు ధరలు పెరిగి పరిశ్రమ మార్జిన్లు భారీగా తగ్గాయని, ఈ క్లిష్ట సమయాల్లో పన్నులను పెంచడం ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తుందని మరియు దేశవ్యాప్తంగా వేలాది టెక్స్టైల్ యూనిట్లను మూసివేయడానికి దారితీయవచ్చుని అన్నారు.
“చేనేత ఉత్పత్తులు మరియు దాని ముడిసరుకుపై 5% జీఎస్టీని రద్దు చేసి, నేత కార్మికులను రక్షించడానికి బదులుగా జనవరి 1, 2022 నుండి దానిని 12%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది, ఇది వారికి మరణ మృదంగం మోగిస్తుంది. పరిశ్రమలు మరియు లక్షల మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోతారు. జౌళి మరియు చేనేత రంగం మన దేశంలో రెండవ అత్యధిక ఉపాధిని అందిస్తుంది. ఈ రంగం ఇప్పటికే కోవిడ్ భారాన్ని భరిస్తోంది. ప్రస్తుత దృష్టాంతాన్ని పరిశీలిస్తే, ఈ రంగానికి అదనపు ప్రయోజనాలు మరియు ప్రోత్సాహకాలను విస్తరించాల్సిన అవసరం ఉంది. రైతులు ఇప్పటికే వీధుల్లోకి వచ్చారు, అనాలోచిత వ్యవసాయ చట్టాలను బలవంతంగా వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రతిపాదిత జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాను. లేదంటే ఈ దేశంలోని చేనేత కార్మికులు తమ రైతు సోదరులు చేసిన వాటిని పునరావృతం చేస్తారు, మేము వారికి అండగా ఉంటాము” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ