హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే విషయంలో ప్రస్తుతం ఉన్నసమస్యలు తొలగించి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 500 కోట్ల రూపాయలను అదనపు నిధులుగా కేటాయించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గురువారం నాడు లేఖ రాశారు. ఈ విజయవాడ -హైదరాబాద్ హైవే నగర పరిధిలో సుమారు 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, హైదరాబాద్ లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉన్న ఈ హైవేకు ప్రత్యేకంగా లెవెల్ జంక్షన్లు, సర్వీస్ రోడ్డు వంటి సౌకర్యాలు లేవని, లేన్ల కెపాసిటీ మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుని మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 500 కోట్ల రూపాయలతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) తయారు చేసిందని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర విస్తరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌళిక వసతుల కల్పన కోసం ప్రాజెక్టులు చేపట్టిందని లేఖలో మంత్రి కేటిఆర్ ప్రస్తావించారు.
కేంద్రం నుంచి హైదరాబాద్ నగరానికి 4 అర్బన్ ప్రాజెక్టులు వచ్చాయని, అందులో మూడు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ వంటి కార్యక్రమాలకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తుందని చెప్పారు. అంబర్ పేట ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు. హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామి ఐటీ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్ బుక్, సేల్స్ ఫోర్స్ వంటి సంస్థలు తమ రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని, అలాగే ఫార్మా, డిఫెన్స్, ఎరో స్పేస్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి చేసిందని, దీంతో పాటు ఎస్సార్డీపి కార్యక్రమంలో భాగంగా, అనేక ఫ్లైఓవర్ లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలను పూర్తి చేసి పెద్ద ఎత్తున లింకు రోడ్ల సౌకర్యం కూడా కల్పించిందని గడ్కరీకి రాసిన లేఖలో మంత్రి పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున రోడ్డు మౌళిక వసతులకు సంబంధించిన కార్యక్రమాలను పూర్తిచేశామని అన్నారు. పెద్దఎత్తున మౌలికవసతుల కల్పన కార్యక్రమాలు చేపట్టామని, రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ప్రోత్సహం ఇచ్చేలా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే కు 500 కోట్లను ప్రత్యేకంగా కేటాయించాలని మంత్రి కేటిఆర్ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu