దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ గత కొన్ని రోజులుగా భారత రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళన నిర్వహిస్తున్న శిబిరం వద్ద రెజ్లర్లకు మరియు పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో కొంతమంది నిరసనకారుల తలకు గాయాలయ్యాయని సహచరులు తెలిపారు. అలాగే ఢిల్లీ పోలీసులు మద్యం తాగి దుర్భాషలాడుతూ తమతో అసభ్యంగా ప్రవర్తించారని మహిళా రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా తమను చంపాలనుకుంటే చంపేయండి అని పోలీసులతో ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత వినేష్ ఫోగట్ ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై బజరంగ్ పునియా, సాక్షి మాలిక్లతో పాటు భారత అగ్రశ్రేణి రెజ్లర్లలో ఒకరైన వినేష్ ఫోగట్ మీడియాకు వెల్లడించారు. మద్యం తాగిన పోలీసులు కావాలనే తమపై అసభ్యంగా ప్రవర్తించారని వారు ఆరోపించారు.
అసలేమైందంటే.. బుధవారం రాత్రి వర్షం కారణంగా రెజ్లర్ల పరుపులు తడిసిపోయాయి, దీంతో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి వారు నిద్రించడానికి మడత మంచాలు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన అనుచరులు మంచాలతో పాటు సైట్కు చేరుకున్నారు. అయితే దీనికి అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రెజ్లర్లు కూడా జోక్యం చేసుకోవడంతో కొందరు పొలీసు సిబ్బంది వారిపైకి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాక మహిళా రెజ్లర్లు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇక ఈ సంఘటన అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతి సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అయ్యాయి. దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ తాయల్ స్పందిస్తూ.. అనుమతి లేకుండా ఎమ్మెల్యే సోమనాథ్ మడత మంచాలు తీసుకువచ్చారని, అందుకే పోలీసులు అడ్డుకున్నారని వివరణ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE