హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం-2022 సన్నద్ధతపై నిర్వహించిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, కాలుకు, చేయికే కాదు మనసుకు, మెదడుకు కూడా మట్టి అంటితేనే వ్యవసాయం అని అన్నారు. ఆహారాన్ని అందరూ ఇష్టపడుతున్నారని, అయితే ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవసాయ రంగాన్ని ఆదరించడం లేదని, ఇష్టంగా చేయాల్సిన వ్యవసాయం పాలకుల పుణ్యమా అని కష్టంగా మారిందన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న పథకాలు, చర్యల మూలంగా ఇప్పడిప్పుడే వ్యవసాయం తిరిగి ఇష్టంగా మారుతున్నదని అన్నారు.
వ్యవసాయం అత్యద్భుతంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ కల, ఆలోచన:
“వ్యవసాయం మంచిగా, గొప్పగా, అద్భుతంగా ఉండడం కాదు. అత్యద్భుతంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ కల, ఆలోచన. వ్యవసాయరంగంలో సమూల మార్పు రావాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష. ఆ దిశగా అందరం కృషిచేయాలి. రైతులు పట్టుదలతో వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించి ఆదర్శంగా నిలవాలి. ప్రపంచ పోకడ, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పంటల సాగును చేపట్టాలి. దేశంలో మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అనాలసిస్ వింగ్ అధ్యయనం చేసి వ్యవసాయ శాఖకు ఇచ్చే నివేదిక ప్రకారం ఏ పంటలు సాగు చేయాలో వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తుంది. రాష్ట్రంలో అత్యధిక జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఏటా 63 లక్షల రైతు కుటుంబాలకు రెండు సార్లు రైతుబంధు పథకం ద్వారా నగదును నేరుగా వారి ఖాతాలాలో జమచేయడం జరుగుతున్నది. భారతదేశంలో వ్యవసాయ వృద్ది రేటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. తెలంగాణ జీఎస్ డీపీలో వ్యవసాయరంగ వాటా 21 శాతం కావడం గమనార్హం” అని మంత్రి అన్నారు.
తెలంగాణ వ్యవసాయ రంగం సమాజాన్ని, పౌరులను ఆకర్షించింది:
“పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది. ప్రపంచంలోని అనేక దేశాలలో పత్తి దిగుబడి లేదు. రాబొోయే మూడేళ్ల వరకు ఎంత ఉత్పత్తి వచ్చినా మార్కెట్ డిమాండ్ తగ్గదు. పత్తి ఏరేందుకు సాంకేతిక పరిజ్ఞానం అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఒకేసారి పంట కాతకు వచ్చే వంగడాల మీద దృష్టిసారించాలి. గతంలో పంటల మార్పిడి రైతులు విరివిగా చేపట్టేది. కాలక్రమంలో ఆ విధానంలో ఎందుకో మార్పు వచ్చింది. ఆ దిశగా మళ్లీ చొరవచూపాలి. సాగులో ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించాలి. అధిక వినియోగం మూలంగా భూములు సహజత్వాన్ని కోల్పోతున్నాయి .. రైతులు తరచూ భూసార పరీక్షలు నిర్వహించాలి. ఒండ్రు మట్టి, పశువులు, గొర్ల ఎరువుల వినియోగం పెద్ద ఎత్తున పెంచాలి. తెలంగాణ పథకాలు, అభివృద్ది చూసి ఇతర రాష్ట్రాల వారు తమ రాష్ట్రంలో కూడా ఈ పథకాలు అమలు చేయాలన్న డిమాండ్ దేశంలో మొదలయింది. తెలంగాణ వ్యవసాయ రంగం సమాజాన్ని, పౌరులను ఆకర్షించింది. ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా తెలంగాణ పౌరులు ఇప్పుడు తెలంగాణలో వెతికి వెతికి మరీ భూములు కొంటున్నారు. తెలంగాణ వ్యవసాయం రైతులను బలపరిచింది. వారి ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది. అన్నం పెట్టే రైతులు నెలవారీగా కంట్రోలు బియ్యం కోసం షాపుల ముందు నిలబడే దుస్థితి ఉండేది. ఆ దుస్థితి నుండి తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా అనిపిస్తుంది” అని మంత్రి పేర్కొన్నారు.
రైతులు వరి సాగు నుండి బయటకు వచ్చి, ప్రత్నామ్నాయ పంటలు సాగు చేయాలి:
“తెలంగాణలో నేడు కనిపించే లక్షల క్వింటాళ్ల ధాన్యపు రాసులను చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఇది తెలంగాణ ప్రజల కష్టం, చెమటచుక్కలు, రక్తం ఉన్నాయి. దీనివెనక ఒక రైతుబంధు, ఒక రైతుభీమా, ఒక 24 గంటల కరంటు, సాగునీళ్లు ఉన్నాయి. దీని వెనక ఏడెనిమిదేండ్లు కరిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మేధస్సు ఉంది. తెలంగాణ వడ్లు కొనాలి అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వద్దకు వెళితే ఇంత ఉత్పత్తి ఎలా వస్తుందని ప్రశ్నిస్తాడు, మా రైతులను మార్చుకునేందుకు మాకు కొంత సమయం ఇవ్వాలంటే ఒప్పుకోలేదు. వారికి వ్యాపార మనసు ఉంది. వ్యవసాయ మనసు లేదు. వరికి మించి లాభాలనిచ్చే పంటలు అనేకం ఉన్నాయి. రైతులు వరి సాగు నుండి బయటకు రావాలి. ప్రత్నామ్నాయ పంటలను సాగు చేయాలి” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ