హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘నీరా కేఫ్’ పనులను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర గౌడ సంఘాల ప్రతినిధులు, ఆబ్కారీ, పర్యాటక శాఖల ఉన్నతాధికారులతో కలసి బుధవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగున పడిపోతున్న కుల, చేతి వృత్తులకు పూర్వ వైభవాన్ని తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని ఎంతో విలువైన నెక్లెస్ రోడ్డులో 25 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా నీరా కేఫ్ ను నిర్మిస్తున్నామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో వందల వేల సంవత్సరాలుగా కొనసాగిస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని, 15 రకాల వ్యాధుల నివారణకు ఔషధ గుణాలు కలిగిన నీరా, కల్లును హైదరాబాద్ నగరంలో నిషేధం విధించి అవమానించారన్నారు. గీత వృత్తిని, వృత్తిదారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న కొంతమంది అహంకార పూరిత రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుల సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నీరా ఉత్పత్తికి ప్రాథమికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనం గ్రామంలో, సంస్థాన్ నారాయణ పురం మండలం సర్వేలు గ్రామంలో, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మునిపల్లి గ్రామంలో, రంగారెడ్డి జిల్లా లోని అమనగల్లు మండలం చరికొండ గ్రామంలో నీరా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాను రైతు బంధు తరహాలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆత్మ గౌరవ భవనాల ను నిర్మిస్తున్నామని, కుల, చేతి వృతుల పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ