తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్ష అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ నెల 11 నుండి ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై MLA కౌసర్ మొయినుద్దీన్, జోనల్ కమిషనర్ ప్రావిణ్య లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ముందుగా మంత్రికి స్థానిక అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, అమ్మవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ బోనాల ఉత్సవాలతో అమ్మవారు శాంతించి కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను చల్లగా చూడాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని కోరారు.
గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. 11 వ తేదీన లంగర్ హౌస్ నుండి గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయం వరకు తొట్టెల ఊరేగింపు జరుగుతుందని అన్నారు. తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ కళాకారులు వివిధ వేషధారణ లతో ప్రదర్శనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అదేరోజు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్ళే సందర్బంగా ఎలాంటి తోపులాటకు అవకాశం లేకుండా పటిష్టమైన భారికేడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. సంస్కృతి ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలలో కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక హెల్త్ క్యాంప్ లు, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా రెండు 500 కేవీ ట్రాన్స్ ఫార్మర్ లు, ఒక మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఆయన వివరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా మహిళా పోలీసు సిబ్బంది, సివిల్ పోలీస్ సిబ్బందిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలలో భక్తులకు తమ సేవలను అందించేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చే వారికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫోటోతో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టూరిజం ఎండీ మనోహర్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరిక్రిష్ణ, ఆలయ ఈవో మహేందర్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ఏసీపీ కోటేశ్వర్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, కార్పొరేటర్ స్వామీ యాదవ్, ఈఈ సత్యనారాయణ, స్ట్రీట్ లైట్ ఈఈ ఇంద్రదీప్, టౌన్ ప్లానింగ్ సీపీ ప్రదీప్, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, జీఎం మాణిక్యం, ఆర్ అండ్ బి ఎస్ఈ పద్మనాభరావు, ఈఈ రవీంద్ర మోహన్, ట్రాన్స్ కో ఎస్ఈ బ్రహ్మం, గోల్కొండ ఫోర్ట్ ఇంచార్జి, నవీన్, హెల్త్ ఎస్పీహెఛ్ఓ అనురాధ, ఆర్టీసీఈడీ వెంకటేశ్వర్లు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ సీఐఈ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ