రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఈ-సిటీలో సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్ ను గురువారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ ను ప్రీమియర్ ఎనర్జీస్ ఉత్పత్తి చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించే వారికీ టీఎస్ ఐపాస్ కింద వెంటనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. 483 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన సోలార్ ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థకు అభినందనలు తెలిపారు. కరోనా సమయంలో కూడా రికార్డు స్థాయిలో ఈ పరిశ్రమను స్థాపించారన్నారు. ఈ పరిశ్రమలో 700 మందికి ఉపాధి లభించిందని, 90 శాతం మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాల ముందు ఉన్న అతి పెద్ద సమస్య యువతకు ఉపాధి కల్పన కల్పించడమని మంత్రి అన్నారు. లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగులకు ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వేల పైచిలుకు పరిశ్రమల ఏర్పాటు జరిగిందని అన్నారు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రెండో స్థానం:
పోటీ ప్రపంచంలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పరిశ్రమలకు అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ పరిశ్రమ అదనంగా మరో పన్నెండు వందల కోట్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా, రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సంస్థను ప్రారంభిస్తామని, ఐటిఐ, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో సమస్యలను సవాళ్లను, ఎదుర్కొని అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని అన్నారు. మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రపంచంలో నివాస యోగ్యమైన ప్రాంతం హైదరాబాద్ అని హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దే విధంగా కేటీఆర్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా టీఎస్ఐపాస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి అన్నారు. వ్యాక్సిన్ తయారీలో మూడోవంతు హైదరాబాద్ నుండి వెళుతుందని అన్నారు. మహిళా సాధికారత కోసం వీ హాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పర్సంటేజీ కల్పించాలని మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు సురభి వాణి దేవి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఐటీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండి నర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమయ్ కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, స్థానిక మున్సిపల్ చైర్మన్ మధు మెహన్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, మాజీ డిజిపి తేజ్ దీప్ కౌర్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ కారంపూడి విజయ్, ప్రీమియర్ ఎనర్జీస్ సురేందర్ పాల్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవి శాలుజా, సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ