తెలంగాణ రాష్ట్రంలో ఈ వేసవిలో ఎక్కడా తాగునీటి సరాఫరాలో ఇబ్బందులు రావొద్దని సీఎం కార్యదర్శి మరియు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ స్పష్టం చేశారు. నీటి క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. తెలంగాణ ప్రజలకు తాగునీటి కష్టం రావొద్దన్న ప్రభుత్వ సంకల్పాన్ని చిత్తశుద్దితో కొనసాగించాలన్నారు. వేసవిలో తాగునీటి సరాఫరాపై ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్నిజిల్లాల ఎస్.ఈ , ఈఈలతో మంగళవారం స్మితా సభర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వేసవిలో 4 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగవచ్చన్న అంచనాల నేపథ్యంలో తాగునీటి సరాఫరాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గ్రామపంచాయితీల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ నీటి సరాఫరాను కొనసాగించాలని చెప్పారు. రిజర్వాయర్లలోని నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు. లీకేజీలు, వృథా లేకుండా చూడాలన్నారు. ట్రీట్ మెంట్ ప్లాంట్ లలోని మోటార్లు, పంపులు, ఎలక్ట్రో మెకానికల్ పరికరాల పనితీరును పరిశీలించాన్నారు. సమస్యలుంటే వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు. ఈ వేసవిలో తెలంగాణలోని ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దటి ఏర్పడద్దన్నారు. అధికారులు ప్రతీ గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలన్నారు. ఎంతో విలువైన నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, చీఫ్ ఇంజనీర్లు కింది స్థాయి సిబ్బందితో రోజూ మాట్లాడాలని సూచించారు. తాగునీటి సరాఫరాలో మిషన్ భగీరథ శాఖకు దేశంలోనే మంచి పేరు ఉందని దాన్ని నిలబెట్టుకునేలా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని స్మితా సభర్వాల్ కోరారు. ఈ వీడియా కాన్ఫరెన్స్ లో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు విజయ్ ప్రకాశ్, వినోభాదేవి, శ్రీనివాస్ రావు, చిన్నారెడ్డి, జ్ఞానకుమార్, లలిత, కన్సల్టెంట్లు నర్సింగరావు, జగన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ