కరోనా వైరస్ కారణంగా ప్రముఖ గాయకుడు, కవి నిస్సార్ జూలై 8, బుధవారం నాడు మృతి చెందారు. ఆర్టీసీ ఎప్లాయీస్ యూనియన్ నేతగా, ప్రజానాట్యమండలి కార్యదర్శిగా, గాయకుడిగా, కవిగా నిస్సార్ పలు సేవలనందించారు. నిస్సార్ స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాలోని సుద్దాల గ్రామం. ప్రస్తుతం ఆయన టిఎస్ఆర్టీసీలో కంట్రోలర్గా పనిచేస్తున్నారు. ఇటీవలే కరోనాపై పోరాటంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేలా ‘కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన’ అనే పాటను కూడా నిస్సార్ రచించారు. నిస్సార్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ఉద్యమ నేతలు, సాహితీవేత్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
నిస్సార్ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “తెలంగాణ పాటను సారవంతం చేసిన కళాకారుడు నిస్సార్. ఆర్టీసీ కండక్టర్ గా పనిచేసిన నిస్సార్ తన పాటల ప్రయాణాన్ని అర్ధాంతరంగా ఆపేసిండు. నల్లగొండ జిల్లా ఉద్యమచైతన్యాన్ని ఆవాహన చేసుకొన్నవాడు. పేద ముస్లిం కుటుంబంలో పుట్టిన నిస్సార్ అనేక ఉద్యమాలకు పాటల ప్రాణవాయువు నిచ్చాడు. ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణ జానపద సాంస్కృతిక రూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు. పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయే అనే పాట తెలంగాణ ధూంధాం సభలలో పెద్ద ఆకర్షణ. తెలంగాణా ఉద్యమ జ్వాలా గీతమైనవాడు. నిస్సార్ కు కన్నీటినివాళి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని” మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.