రాజకీయాల్లో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేం. కొంతమంది ఏ పదవీ చేపట్టకుండా వట్టి సీనియర్లుగానే మిగిలిపోతారు. మరికొంతమంది చిన్న వయసులోనే పెద్ద పెద్ద పదవులను అలంకరిస్తారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లో దూసుకుపోతారు. అలా ఇప్పుడు సీనియర్ నేతలతో పోటీ పడుతున్న ఇద్దరు మహిళా అభ్యర్దులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో.. ఇద్దరు యువతులు.. సీనియర్లతో పోటీ పడుతున్నారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఈ ఇద్దరు గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎదరులేని నేతగా ఎదిగిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. తాజా ఎన్నికల్లో మరోసారి పాలకుర్తిలో కారు గుర్తుపై పోటీచేస్తూ ఉధృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకరరావు మీద కాంగ్రెస్ పార్టీ నుంచి 26 ఏళ్ల యశస్విని రెడ్డి పోటీకి దిగారు.
అలాగే ములుగు నియోజకవర్గంలో ప్రజల్లో మంచి ఆదరణ పొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా ఈ సారి బరిలోకి దిగారు. నక్సలైట్ నేపథ్యం ఉన్న సీతక్క.. మూడోసారి ములుగు నుంచి పోటీ చేస్తున్నారు. నక్సల్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాగజ్యోతి బీఆర్ఎస్ నుంచి సీతక్కకు ప్రత్యర్ధిగా బరిలోకి దిగారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో జూనియర్లు, సీనియర్ల మధ్య జరుగుతున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
ములుగులో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న బడే నాగజ్యోతి.. బీఆర్ఎస్ తరఫున పోటీకి దిగిన అభ్యర్థులందరిలో చిన్న వయస్కురాలు. 25 ఏళ్లకే ములుగు జడ్పీ ఛైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించిన నాగజ్యోతి.. 29 ఏళ్లకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని పొందారు. ఎమ్మెస్సీ పూర్తి చేసిన నాగజ్యోతి రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో పాలిటిక్స్లోకి వచ్చారు.
ముందుగా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీటును ఆశించిన ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. తనకకు టికెట్ అన్న నమ్మకంతో కొన్ని నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. అయితే భారత పౌరసత్వం పొందడంలో ఆమెకు ఇబ్బందులు రావడంతో ఝాన్సీరెడ్డి కోడలైన యశస్విని రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశాన్ని ఇచ్చింది. బీటెక్ చదివిన యశస్విని రెడ్డి 26 ఏళ్లకే ఎమ్మెల్యే అభ్యర్థిగా.. జిల్లాలో సీనియర్ నేత ఎర్రబెల్లిపై పోటీ చేస్తూ..తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఇలా ఉన్నత చదువులు చదివిన ఇద్దరు యువతులు.. జిల్లాలోనే ఉద్ధండ నేతలుగా గుర్తింపబడ్డవారితో ఈసారి తలపడుతున్నారు. ములుగు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సీతక్కకు ఇప్పటికే రెండు సార్లు గెలిచిన రికార్డు ఉంది . జననేతగా, నియోజకవర్గంలో బలమైన నేతగా కూడాగుర్తింపు పొందారు. అలాంటి ఎమ్మెల్యే సీతక్కతో అదే సామాజికవర్గానికి చెందిన నాగజ్యోతి పోటీకి తలపడుతున్నారు.
పాలకుర్తిలో గులాబీ పార్టీ తరపున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేస్తున్నారు. దయాకర్ రావు ఇప్పటికే ఒకసారి ఎంపీగా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రిగానూ కొనసాగుతున్నారు. తన రాజకీయ చరిత్రలో ఓటమే ఎరుగని ఎర్రబెల్లి దయాకర్పై యశస్విని రెడ్డి పోటీ పడుతున్నారు. ఇలా ఇద్దరు యువతులు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతూ..ఇద్దరు ఉద్ధండులతో డీకొట్టడానికి రెడీ అవడంతో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరి చూపూ ఇటే పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE