బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం క్రమక్రమంగా కుదుట పడుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో.. సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబ సభ్యులు కేసీఆర్ను ఆసుపత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్లోని నందినగర్లో ఉన్న తన పాత నివాసానికి తీసుకెళ్లారు. కేసీఆర్కు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అలాగే వైద్య సేవల కోసం తరచూ ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ఫామ్హౌస్లో కాకుండా నందినగర్లోని ఇంట్లోనే కేసీఆర్ను ఉంచాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
ఇకపోతే గతవారం ఎర్రవెళ్లిలోని తన ఫామ్హౌజ్లో కేసీఆర్ కాలు జారికిందపడిపోయారు. ఆ సమయంలో ఆయన తుంటికి గాయం కావడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈనెల 8న యశోద ఆసుపత్రి వైద్యులు కేసీఆర్ ఎడమ కాలు తుంటి మార్పిడి ఆపరేషన్ను చేశారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇక కేసీఆర్కు గాయమయిన విషయం తెలిసి రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీ ప్రముఖులు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ను పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి ఆసుపత్రి వద్ద రద్దీ నెలకొనడంతో కేసీఆర్ స్వయంగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తాను కోలుకొన్నాక అందరినీ కలుస్తానని.. దయచేసి ఎవరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ