టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రచారపర్వంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆలస్యంగా మొదలుపెట్టినా జాతీయ నాయకులు.. పదునైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరంగానే చేస్తోంది. బీసీ సీఎం.. ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలతో ప్రచార సభలను నిర్వహించడం.. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ వినూత్న పంథా అవలంభిస్తోంది. పార్టీ అగ్రనాయకత్వంతో ప్రచారాన్ని హీటెక్కిస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా వంటి కీలక నేతలు పలుమార్లు తెలంగాణలో ప్రచారం చేశారు.. చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా.. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు తెలంగాణలోనే మకాం వేశారు.
మరో ఆరు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో మరింత పట్టు బిగించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో పర్యటించేందుకు జాతీయ నేతలు క్యూ కట్టారు. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు, మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా వరుగసా మోదీ సభలకు ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా.. అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, యోగీ వంటి నేతలతో వారం రోజుల్లో ఆరు సభలకు సిద్ధమవుతోంది. నిర్మల్, కరీంనగర్, మెదక్, వరంగల్లో మోడీ సభకు ప్రణాళికలు చేస్తున్నారు. 27న హైదరాబాద్లో మోడీ భారీ రోడ్ షో చేయనున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా, యోగీ ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, దేవేంద్ర ఫడ్నవీస్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ 25, 26న హుజురాబాద్, మహేశ్వరంలో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈనెల 24, 25, 26న తెలంగాణకు రానున్నారు. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ , గోవా సీఎం ప్రమోద్ సావంత్ లు కూడా తెలంగాణ పర్యటనలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే రెండు సభల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ నిన్న గ్రేటర్ హైదరాబాద్ మీట్ ది గ్రీట్, రోడ్ షో వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యకతపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో గట్టి పోటీ ఇస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని గోషామహల్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం వంటి స్థానాల్లో గెలుపు కోసం పోరాడుతోంది. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలుగా బరిలో ఉన్న స్థానాల్లోనూ పోటీ ఆసక్తిగా మారింది.
మొత్తంగా పార్టీ జాతీయ నాయకత్వం అంతా తెలంగాణలో మొహరించేలా చేసి రాష్ట్రంలో నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేసింది. అగ్రనాయకులతో ప్రచారం చేస్తూ.. ఆలస్యమైనా అదరగొడుతుందని చర్చ జరిగేలా అయితే చేసుకుంది. కానీ.. ఇది ఎంత వరకు ఓట్ల పంట పండిస్తుందనేది చూడాలి. జాకీ పెట్టి లేపినా.. లేవలేని స్థితికి రాష్ట్రంలో చేజేతులా చేసుకున్న అధిష్ఠానం.. చివరి దశలో హడావిడి చేస్తోంది. ప్రధాని సహా ఎందరు తెలంగాణలో ప్రచారం చేసినా.. పోటీ రెండు, మూడో స్థానాల కోసమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముగింపు దశలో పోటీ ఎలా మారనుందో వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE