తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పారిశ్రామిక రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అణా పైసా సహాయం కూడా అందలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ 2021-22 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు శాసనసభ్యులు టీఎస్ ఐపాస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే సందర్భంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక శాసనసభలో మొట్టమొదటిగా టీఎస్ ఐపాస్ చట్టాన్ని ఆమోదించుకున్నామని చెప్పారు. ఈ చట్టం ద్వారా ఆరున్నర సంవత్సరాల్లో 2 లక్షల 13 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులను ఆకర్షించుకోగలిగామని చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సహాయంపై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పార్లమెంటులో ఆమోదించినపుడు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పారిశ్రామీకీకరణలో సహాయం చేయాలని, ప్రత్యేక రాయితీలు ఇస్తామని స్పష్టంగా చెప్పినప్పటికీ, ఆరున్నర సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అణా పైసా సహాయం కూడా చేయలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. పార్లమెంట్లో రూపొందించిన చట్టాన్నే తుంగలో తొక్కుతున్నారని, ఈ అంశంపై చాలా సార్లు నివేదికలు అందించి ఏ రకంగా తెలంగాణలోని పరిశ్రమలను ఆదుకోవచ్చో చెప్పామన్నారు. ఇప్పటికైనా చేసిన చట్టాన్ని గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ