వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు ఈటల రాజేందర్, కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, వైద్య ఆరోగ్యశాఖ 365 రోజులు నిరంతరం పనిచేసే శాఖని, గత ఆరు నెలలుగా అందరూ ఇళ్ళకు మాత్రమే పరిమితమైతే కోవిడ్ సందర్భంగా ఆరోగ్య శాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నం అయిందని అన్నారు. కరోనా ప్రభావం వలన వైద్య శాఖ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఆ దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసే దిశగా పని చేస్తున్నామని అన్నారు. కోవిడ్ సందర్భంగా పనిచేసిన ప్రతి ఒక్క వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెల్పుతున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది. ఇది ముమ్మాటికి వైద్య ఆరోగ్య శాఖ కృషి ఫలితమే:
మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా వైద్యఆరోగ్యశాఖ అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా మంత్రి ఈటల రాజేందర్ నాయకత్వంలో వైద్యారోగ్యశాఖ ప్రజల్లో భరోసా నింపే విధంగా పనిచేస్తూ కరోనా నుంచి ప్రజలను కాపాడుతుందని అన్నారు. “ప్రస్తుతం ఉన్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కరోనా సందర్భంగా ఏర్పడింది. రానున్న కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింతగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. కేవలం ఆరు నెలలు మాత్రమే కాదు మొత్తం గత ఆరు సంవత్సరాలుగా వైద్యఆరోగ్యశాఖ అద్భుతమైన పనితీరును కనబరిచిన అనేక విజయాలను సాధించింది. మాతా, శిశు మరణాల రేటు తగ్గించడం నుంచి మొదలుకొని డయాగ్నస్టిక్ సెంటర్ లో ఏర్పాటు హాస్పిటల్స్ లో ఐసీయూ యూనిట్స్ ఏర్పాటు, బ్లడ్ బ్యాంకుల ఏర్పాటు, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఈసారి సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయి. ఇందుకు పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ తో కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యం అయింది. రోగాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగింది. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే ప్రస్తుతం రాష్ట్రంలో అదుపులో ఉంది. ఇది ముమ్మాటికి వైద్య ఆరోగ్య శాఖ కృషి ఫలితమే అని” మంత్రి కేటిఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu