తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చి 4, గురువారం నాడు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ముందుగా యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.
యాదాద్రి కొండపై ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల అభివృద్ధి పనులు తుది దశకు చేరి ఉద్ఘాటనకు సిద్ధమవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో ప్రాకార మండపాలు, మాఢవీధులు, తిరువీధుల్లో నక్షత్ర మొక్కలు, సుగంధ పుష్పాల ఉద్యానవన అభివృద్ధి, క్యూకాంప్లెక్స్, ప్రసాదాల కాంప్లెక్స్, శివాలయం, విష్ణు పుష్కరిణిని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. అలాగే కొండచుట్టూ రింగు రోడ్డు నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మాణం, గండిచెరువు వద్ద పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, ఇంకా పూర్తి కావాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముందుగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను అక్టోబరు 11, 2016 న రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపుగా అన్ని అభివృద్ధి పనులు పూర్తికావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రిలో సీఎం కేసీఆర్ చేసే ఈ పర్యటన అనంతరం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తంపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ