ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు సీనియర్ ఐఎఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో కోవిడ్ నియంత్రణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితిని అదిగమించుటకు అధికారులందరు అంకిత భావంతో పనిచేయాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది, ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కూడిన బృందాలను ప్రతి ఇంటికి పంపించాలని, జ్వరం మరియు ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించి, మెడికల్ కిట్లను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని పిహెచ్సిలు, బస్తీ దవాఖానాలు, ఇతర ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ అవుట్ పేషెంట్ క్లినిక్లను నిర్వహించాలని ఆదేశించారు.
ఆసుపత్రులలో కోవిడ్ పడకల సంఖ్యను పెంచాలి:
నిమ్స్ ఆసుపత్రి, సరోజిని దేవి, ఛాతీ, గాంధీ, ఫివర్, టిమ్స్, కింగ్ కోటి మరియు మలక్ పేట, గోల్కొండ, వనస్థలిపురం, కొండపూర్ తదితర ఆసుపత్రులలో కోవిడ్ పడకల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో పరిశుభ్రమైన పరిస్థితులను కొనసాగించడానికి పరిశుభ్రత డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ డా.యన్.సత్యనారాయణ, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శి ఒమర్ జలీల్, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాస రాజు, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ