తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయం సీఎం కేసీఆర్ కు గుర్తులేదా?, తెలంగాణ వచ్చాక విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయి? అని అమిత్ షా ప్రశ్నించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ పరాక్రమం వల్లే హైదరాబాద్ సంస్థానం విమోచనం సాధ్యమైందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. కర్ణాటకలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, అలాగే తెలంగాణలోనూ తప్పకుండా నిర్వహించి తీరుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న అధ్యక్షుడు బండి సంజయ్ కు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని సమస్యలు తెలుసుకునేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతిమదశకు చేరిందని ఎద్దేవా చేశారు. ఇక మజ్లిస్ ను ఓడిస్తేనే తెలంగాణకు నిజమైన స్వేచ్ఛఅని, బీజేపీ మాత్రమే మజ్లిస్ తో పోరాడుతుందని, కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ తో దోస్తీ చేస్తున్నాయని అన్నారు. అలాగే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ను గెలిపించాలని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ