ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు దేశ రాజధాని ఢిల్లీలో తమ నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేపట్టారు. నేటితో రాజధాని ఉద్యమం ప్రారంభమై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమరావతి రైతులు ధర్నాకు దిగారు. వివిధ కార్యక్రమాల కోసం అమరావతి రైతులు, మహిళలు రెండు రోజుల క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఉద్యమం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజధానిలో తమ నిరసనను తెలుపడానికి వారు సిద్ధమయ్యారు. 15వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రాజధాని రైతులు ప్రత్యేక రైలులో ఢిల్లీకి చేరుకున్నారు. ‘అమరావతి పరిరక్షణ సమితి’ నేతృత్వంలో వారు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నాను కొనసాగించనున్నారు. ఈ ధర్నాకు వామపక్ష పార్టీల నేతలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్బంగా రైతులు పలువురు కేంద్ర మంత్రులను, పలు పార్టీల ఎంపీలను కలిసి మద్దతు కోరనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ