ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సీపీఎస్కు బదులుగా జీపీఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్) అమలుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీపీఎస్పై ఉద్యోగులతో చర్చించేందుకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి బొత్స, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సభ్యులుగా ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలోని కమిటీ సోమవారం వెలగపూడి సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సీపీఎస్పై చర్చించేందుకు సమావేశమైంది. వారితో చర్చల తర్వాత మంత్రుల కమిటీ ప్రభుత్వానికి ఈ అంశంపై తుది నివేదిక ఇవ్వనుంది. అయితే, ఈ సందర్భంగా మంత్రి బుగ్గన ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతూ.. సీపీఎస్ విధానానికి బదులుగా జీపీఎస్ విధానం అమలుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కొత్త విధానంతో ప్రభుత్వోద్యోగులకు ఎక్కువ లబ్ధి కలుగుతుందని ఆయన చెప్పారు. కనుక ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ ప్రతిపాదనను పరిశీలించి.. దీనిపై వారికి గల అనుమానాలను లేదా సలహాలు, సూచనలు లాంటివి ఏవైనా చేస్తే వాటిపై అలోచించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందని తెలిపారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) విధానం ప్రపంచవ్యాప్తంగా పలు సవాళ్ళను ఎదుర్కొంటోందని, అందుకే.. సీపీఎస్, ఓపీఎస్ కాకుండా జీపీఎస్ విధానానికే ఏపీ ప్రభుత్వం మొగ్గుచూపుతోందని వెల్లడించారు. ప్రభుత్వోద్యోగుల క్షేమం కోసం ఒక కొత్త పెన్షన్ పథకాన్ని రూపొందించేందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, ఇంకా పలువురు ఉన్నతాధికారులు పాల్గొనగా.. ఉద్యోగ సంఘాల తరఫున బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ