ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిని ప్రారంభించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేడు, రేపు రెండు రోజుల పాటు జరుగనుంది. కాగా ముందుగా ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ రెడ్డి ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ కూచిపూడి నృత్యంతో ఈ కార్యక్రమం ఆరంభించారు. ఐటీ, వ్యవసాయం, ఆరోగ్యం, ఫార్మా, టూరిజం, ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, ఏరోస్పేస్, చేనేత మరియు వస్త్రాలు, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి తదితర 14 రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలకు ప్రదర్శించనుంది.
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు మరియు పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించడానికి ఈ సదస్సు వేదిక కానుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పారిశ్రామిక వర్గాల ప్రకారం, ఈ సదస్సు పారిశ్రామికీకరణకు కొత్త బెంచ్మార్క్ను నిర్దేశిస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామిక కేంద్రంగా ఉన్న వైజాగ్ భారీ పెట్టుబడులను ఆకర్షించనుంది. కాగా ఈ కార్యక్రమానికి దాదాపు దాదాపు 8,000 నుండి 9,000 మంది ప్రతినిధులు సమ్మిట్లో పాల్గొననున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, శ్రీ సిమెంట్ లిమిటెడ్ చైర్మన్ హరి మోహన్ బంగూర్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, బజాజ్ ఫిన్సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ సంజీవ్ బజాజ్, మరియు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ జిందాల్ తదితరులు పాల్గొంటున్నారు. ఇక అంతకుముందు గురువారం జిల్లా కలెక్టర్ ఎ మల్లిఖార్జున్, పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్తో కలిసి విమానాశ్రయం నుండి ఎయు ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు ఎఎస్ఎల్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్) నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE