ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కరోనా నియంత్రణ చర్యలు, వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష చేపట్టారు. దేశవ్యాప్తంగా, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ సమీర్శర్మ, డీజీపీ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా మహమ్మారిని నివారించడంలో కీలకమైన ట్రేసింగ్, టెస్టింగ్పై ఏపీ ప్రభుత్వం కీలక దృష్టి పెట్టింది. అలాగే, మంగళవారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలుపై పలు సూచనలు చేశారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై సమీక్షిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ చర్చించారు.
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమీక్షలో వివిధ ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ పరిస్థితులను అధికారులు వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. రెండో వేవ్తో పోల్చిచూస్తే.. ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధం చేశామని అధికారులు పేర్కొన్నారు. అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ కేసుల్లో ఆస్పత్రుల్లో దాదాపు 27వేల యాక్టివ్ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారని వివరించారు. ఇందులో ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమేనని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య పరమైన అవసరాలను గుర్తించి ఆక్సిజన్ను, మందులను సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలంటే కనీసం 14 రోజులు ఉండేదని, ఇప్పుడు వారం రోజులకే డిశ్చార్జి అవుతున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ను గుర్తించామని వారు చెప్పారు. అలాగే, కోవిడ్ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు సుమారు 28 వేల బెడ్స్ ను సిద్ధంచేశామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్స్ సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎం కు తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే జరిమానాతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ