ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలోనే రోజువారీగా 50 వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి మిలియన్ జనాభాకు 31 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 90 శాతం పరీక్షలు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నామని, బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో ముందుకు పోతున్నామని చెప్పారు. కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నప్పుడు భయపడి, పరీక్షలు తగ్గించి కేసులు తక్కువుగా చూపే ప్రయత్నం చేస్తారని, కానీ అలాంటి తప్పులు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగలేదని అన్నారు. కరోనా కేసుల లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తక్కువ చేసి చూపించలేదని సీఎం పేర్కొన్నారు.
కరోనా వస్తుంది, తగ్గి పోతుంది, దానితో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరోనా రావడం నేరము, పాపం కాదు. కరోనాతో చనిపోతే అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోవడం విచారకరం అన్నారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇప్పటికే అందులో సగం మందికి నయమైపోయిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆధునిక కార్పొరేట్ ఆస్పత్రులు లేనప్పటికీ, మరణాల రేటు తగ్గించేలా చర్యలు తీసుకుని 1.06 శాతానికి పరిమితం చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu