ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10, గురువారం నాడు ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించగా, మిగిలిన ఇతర జిల్లాల్లో మంత్రులు,ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికి ఉచితంగా కంటి పరీక్షలు, వివిధ రకాల శస్త్రచికిత్సలు అందిచనున్నారు. మొత్తం 6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కంటి వెలుగు పథకాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 62 వేల ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.
అక్టోబర్ 10 నుంచి 16 వరకు నిర్వహించే వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం మొదటి దశలో సుమారు 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రాథమికంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగే రెండో దశలో అప్పటికే కంటి సమస్యలు గుర్తించిన వారికీ వివిధ విజన్ సెంటర్లకు పంపించి చికిత్సలు అందించనున్నారు. ఇందులో భాగంగా కళ్లజోళ్ళు, క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఇతర సేవలను కూడ ఉచితంగా అందిస్తారు. ఇక ఫిబ్రవరి 1, 2020 నుంచి రాష్ట్రంలో ప్రజలందరికీ వైఎస్సార్ కంటి వెలుగు పధకం అమలులోకి రానుంది.
[subscribe]