తెలంగాణలో ఆరవరోజు కూడ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్న డిపోల ముందు, మద్దతుగా వచ్చిన రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో ప్రభుత్వ అధికారులు తాత్కాలిక ఉద్యోగులతో ప్రజల అవసరాలకనుగుణంగా 5,000 పైగా బస్సులను నడిపిస్తున్నారు. సమ్మె విషయంలో ప్రభుత్వం, కార్మికులు తమ వైఖరిని మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. మరోవైపు రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెకు ముందు అన్నిరూట్లలో ఎలాంటి షెడ్యూల్ ఉండేదో , అదే షెడ్యూల్ను పూర్తి స్థాయిలో శుక్రవారం నుంచి అమలు చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేసారు. టికెట్ ధరను మించి ఒక్క రూపాయి ఎక్కువగా ప్రయాణికుల నుంచి వసూలు చేసిన కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రతి బస్సులో ఆ రూట్లలో ఉండే చార్జీల పట్టికను, కంట్రోల్ రూమ్ నెంబర్లతో సహా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో అన్ని రకాల బస్సు పాసులను అనుమతించాలని, పాసులపై ఎటువంటి ఫిర్యాదులు రావద్దని మంత్రి స్పష్టం చేసారు.
సమ్మెపై నేడే హైకోర్టులో విచారణ:
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్పై అక్టోబర్ 10, గురువారం నాడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై అన్ని డిపోల మేనేజర్లు నుంచి రిపోర్ట్ సేకరించిన ప్రభుత్వం నేడు కోర్టులో సమర్పించి, పిటిషన్ దాఖలు చేయనుంది. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు సంప్రదింపులు ఆపేసి, సమ్మె విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో కోర్టు తీర్పు కీలకంగా మారే అవకాశం ఉంది.
బంద్ పై ప్రకటన:
అక్టోబర్ 9, బుధవారం నాడు సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆర్టీసీ జేఏసీ నాయకులు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పలు రాజకీయపార్టీల నేతలు, ఉద్యోగసంఘాల నాయకులు హాజరయ్యి సమ్మెపై చర్చించారు. అయితే మరోసారి అక్టోబర్ 10, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతుంది. సమ్మె నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి రాష్ట్ర బంద్ పై వివరించనున్నారు.
[subscribe]