రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకూ జీవన్మరణ సమస్యగా మారింది. భారీ డైలాగులతో, భయంకరమైన సవాళ్లతో తెలుగుదేశం – జనసేన పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు.. ‘మీ బిడ్డ వల్ల మంచి జరిగిందని భావిస్తే మాకే ఓటు వేయండి’ అంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో హోరెత్తిస్తున్నారు. వీరిలో ఎవరు ఓడినా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే గెలుపు కోసం అన్ని పార్టీలూ చెమటోడ్చుతున్నాయి. గతానికి భిన్నంగా వ్యూహాలు పన్నుతున్నాయి. పొత్తులు కత్తి కత్తులు దూస్తున్నాయి.
గెలుపుకోసం కూటమి వ్యూహాలు పన్నుతూనే.. అధికార పక్షం చేస్తున్న కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తోంది. ప్రధానంగా వలంటీర్లపై ఫోకస్ పెట్టింది. ఏపీలో వలంటీర్లు జగన్ దత్తపుత్రులనే ప్రచారం ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపు లక్షన్నర మంది వలంటీర్లను నియమించారు. వారి ద్వారానే సంక్షేమ పథకాలను గడపగడపకూ చేరవేస్తున్నారు. అక్కడక్కడా వలంటీర్లపై ఆరోపణలు వస్తున్నా.. మొత్తంగా మంచి పేరే ఉంది. ఈక్రమంలోనే వైసీపీ నేతలు అందరూ రానున్న ఎన్నికల్లో వలంటీర్ల సేవలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధికారిక హోదాలో ఆదేశాలు జారీ చేయడంతో పాటు.. ఇప్పటి నుంచే వారికి తాయిలాలూ రుచి చూపిస్తున్నారు.
ఇటీవల కాకినాడ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ చార్జి ఓటర్లకు ఫోన్ చేస్తూ.. ఓటు ఎవరికి వేస్తారని అడగగా.. మా వలంటీర్ ఎవరికి వేయమని చెబితే వారికే వేస్తాం.. అని కొందరు వృద్ధులు సమాధానం ఇచ్చారట. వారి సమాధానం విని ఆ టీడీపీ నేత కంగుతిన్నారు. వాస్తవానికి ఈ వలంటీర్లు వచ్చాకే.. ఒకటో తేదీ తెల్లవారుజామునే ఇళ్లకు వృద్దాప్య పింఛన్లు అందిస్తున్నారు. అలాగే.. పలు ప్రభుత్వ పథకాలకు వారే దరఖాస్తులు తీసుకుని పనులన్నీ పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. స్థానికంగా వారిపై చాలామందికి మంచి అభిప్రాయమే ఉంది. ఇది ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఓ అభ్యర్థి.. తన పార్లమెంట్ పరిధిలోని ప్రతీ ఒక్క వలంటీర్కూ ముందస్తుగా వెయ్యి రూపాయల నజరానా అందించి.. మున్ముందు మరింత సహాయం చేస్తానని చెప్పినట్లు తెలిసింది.
ఎన్నికల విధులకు వలంటీర్లను దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల ఆదేశించింది. వారిని పోల్ ఏజెంట్లుగా కూడా నియమించవద్దని స్పష్టం చేసింది. అయినా సరే… వలంటీర్లను ఎన్నికల్లో పూర్తిస్థాయిలో వాడుకోవడానికి చాలామంది వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. వారికి ప్రత్యేక తాయిలాలు అందిస్తున్నారు. నేరుగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు వలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ‘మిమ్మల్నే నమ్ముకున్నాం. మీరే గెలిపించాలి’ అని వేడుకుంటున్నారు. చివర్లో… కుక్కర్లు, దుస్తులను సంచుల్లో పెట్టి ఇస్తున్నారు. ఒక్కో చోట రూ.5వేల దాకా నగదును అందిస్తున్నారు. ఓ మంత్రి వలంటీర్లకు ఏకంగా సెల్ఫోన్లు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ విపక్షాలకు మింగుడు పడడం లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE