ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఉత్తరాంధ్ర కీలక నాయకుడు అయ్యన్న పాత్రుడు సొంతపార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే నేతలు అండగా నిలవాలని, అప్పుడే పార్టీ పదికాలాల పాటు నిలబడుతుందని పేర్కొన్నారు. అంతేకానీ తమ రాజకీయ అవసరాల కోసం వచ్చేవారి వలన ఎలాంటి ఉపయోగం లేదని, అలాంటివారిని పార్టీ అధిష్టానం కూడా గుర్తించి దూరం పెట్టాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. అయినా తామెవ్వరికీ వ్యతిరేకులం కాదని, తమకు అందరూ కావాలని, కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా అభిమతమని తెలిపారు. మరో కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి.. ఆయనేమైనా పెద్ద నాయకుడా? ప్రధాన మంత్రా? అని ప్రశ్నించిన ఆయన లక్షల్లో ఆయనొకడు, లక్షల్లో తానొకడినని పేర్కొన్నారు.
ఇక టీడీపీకి ఆవిర్భావం నాటినుంచీ బడుగులే అండగా ఉన్నారని, పార్టీ బీసీలకే పెద్ద పీట వేసిందని తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా బీసీలు టీడీపీకి ఎప్పుడూ అండగానే ఉన్నారని, త్వరలోనే టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బీసీ సదస్సులు పెడతామని, దీనిలో పార్టీలోని బీసీ నేతలందరూ పాల్గొంటారని వెల్లడించారు. విభజన జరిగి ఎనిమిదేళ్లవుతున్నా, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని మండిపడ్డారు. దీనికి ప్రధాన కారణం అధికార వైసీపీ పార్టీయేనని, వారి విధానాల వల్ల రాష్ట్రంలోని అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ ధర మిగిలిన కంపెనీల ధరకంటే రూ. 20 ఎక్కువని, ఎందుకు అధిక ధర వసూలు చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE