ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 21, మంగళవారం నాడు పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద పథకంపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, కరోనా నిబంధనలను అనుసరించి పాఠశాలలు ప్రారంభించే యోచన చేస్తునట్టు వెల్లడించారు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో సెలవుల తగ్గింపు, సిలబస్, ఇతర అంశాలపై త్వరలోనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ విడుదల చేయనున్నట్టు తెలిపారు.
అలాగే వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పీపీ-1, పీపీ-2 రూపంలో ప్రీప్రైమరీ విద్య (ఎల్కేజీ, యూకేజీ విద్య) అమలు చేస్తామని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, జగనన్న గోరుముద్దలను పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్ స్థాయి పోస్టులు, విద్యాప్రమాణాలు మెరుగుదలకు జిల్లా స్థాయిలో డీఈఓ, జేడీలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తునట్టు మంత్రి తెలిపారు. ఇక 8 వ తరగతి నుంచి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి సురేష్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu