ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. వివిధ సందర్భాల్లో ఏపీలోని పరిస్థితులపై తెలంగాణ మంత్రులు ఏవో ఒక వ్యాఖ్యలు చేయడం.. దానికి ఏపీ మంత్రులు స్పందించడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టు కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయ్యిందని, అయినా ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. అంతేకాకుండా ఇంకో ఐదేళ్లు అయినా అది పూర్తి కాదని, దీనిపై కొంతమంది ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారని తెలిపారు. అయితే మన కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తి చేశామో అందరూ చూశారని, ఇప్పుడు దాని ఫలాలు కూడా అందరికీ అందుతున్నాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం మంత్రి హరీష్ రావు ఏపీకి సంబంధించి మరోసారి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఇక హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మంత్రి అంబటి హరీష్ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వారి ప్రభుత్వ గొప్పదనాన్ని గురించి చెప్పారో, లేక వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కించపర్చడానికి పోల్చారో తెలియదు గానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు రెండూ వేరు వేరని అన్నారు. కాళేశ్వరం కేవలం 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజీ అని, మరియు అది పూర్తిగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తెలిపారు. కానీ పోలవరం అలా కాదని, ఇది బహుళార్దకమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. 196 టీఎంసీ స్టోర్ చేసుకొని గ్రావిటీ ద్వారా నీరు తరలించే అవకాశం ఉన్న మెగా ప్రాజెక్టు అని, ఇలాంటిది ప్రపంచంలోనే అతిపెద్దదని చెప్పారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు, పోలవరం ప్రాజెక్టుకు.. నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి గల కారణాలను కూడా మంత్రి అంబటి రాంబాబు వివరించారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే దానికి చాలా కారణాలున్నాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ను ముందుగా నిర్మించడం వల్ల ఈ సమస్య ఏర్పడిందన్న ఆయన స్పిల్ వే తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని, కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అలా చేయలేదని, దీనివలన అనంతరం వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని తెలిపారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులపై నిపుణుల పర్యవేక్షణలో పరిశోధన సాగుతోందని, దీనిపై స్పష్టత రాగానే పోవరం నిర్మాణంపై ఎప్పటిలోగా పూర్తవుతుందో ఒక అంచనాకు రావొచ్చని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. కాగా గతంలో కూడా ఒకసారి టీచర్లకు సంబంధించి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అప్పుడు ఆయన వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE