ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 7లక్షల కోట్ల వరకు అప్పు చేశారని జగన్ సర్కార్ను విమర్శించారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు భారం మోపారన్నారు. దీనివలన పేదలపై ఒక్కొక్కరికీ నెలకు 5 నుంచి 10వేల రూపాయల వరకు అదనపు భారం పడుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యను అధిగమించేందుకు విధానపరమైన ప్రణాళికలు ఏవి ప్రభుత్వం వద్ద లేవని బాబు దుయ్యబట్టారు. పైగా అవసరాలకోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని చంద్రబాబు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు తేవడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందన్నారు. జగన్ సర్కార్ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ద్రోహుల ఆట కట్టించాలంటే.. ప్రజాచైతన్యం రావాలని బాబు పేర్కొన్నారు. ఆంధ్రాకి నేనే ఆఖరి సీఎంని అన్నట్లు రాష్ట్రంలో ఉన్న ఆస్తులను సీఎం జగన్ అమ్ముతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్నారని, రేపు ఆ అప్పులు ప్రజలే కట్టవలసి ఉంటుందని మండిపడ్డారు. చివరికి చెత్త పైనా పన్ను విధించారని.. ఇంత అధ్వాన్న పరిస్థితిని ఎప్పుడు చూడలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ