ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని కాట్రేనికోన మండలం దొంతకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యుదాఘాతంతో యడ్ల నవీన్ అనే మూడో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో నలుగురు విద్యార్థులు కూడా గాయపడ్డారు. వీరిలో మూడో తరగతి చదువుతున్న చిట్టిమేను వివేక్, నాలుగో తరగతి చదువుతున్న తిరుపతి ఘన సతీష్ కుమార్ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వ్యాద్యం కోసం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం భవనం పనుల నిమిత్తం కొన్ని ఇనుప సామాగ్రి కటింగ్ మెషిన్స్ కోసం అమర్చిన తీగలు ప్రమాదవశాత్తూ త్రాగునీటి కోసం వచ్చిన విద్యార్థులకు తగలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఇక చికిత్స పొందుతున్న విద్యార్థులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, జిల్లా ఏఎస్పీ లతామాధురి తదితరులు పరామర్శించారు. ఆస్పత్రి వైద్యులను అడిగి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కాగా జరిగిన ఘటన విషయం తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు రూ. 1 లక్ష అందించాలని, దగ్గరుండి మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY