గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల లోని ఇళ్ళు లేని పేదవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరందరికీ రాజధాని అమరావతిలో ఇంటి పట్టాలు అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 33వ సీఆర్డీయే అథారిటీ సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ మూడో విడతలో భాగంగా త్వరలోనే వారికి ఇళ్ల పట్టాలు అందివ్వనున్నారు. కాగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఇప్పటికే జీవో జారీ అయ్యింది. దీని ప్రకారం అమరావతిలోని మొత్తం 20 లే-అవుట్లలో 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్ల కోసం కేటాయింపు జరగాల్సి ఉంది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 48,218 మందికి రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ సమాయత్తమవుతోంది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని సూచించిన ఆయన, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ఇక మే నెల మొదటివారం నాటికి దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇళ్ళు లేని పేదలకు వారి జీవితకాల స్వప్నమైన సొంతింటి కల నెరవేరడానికి ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. కాగా సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు.. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE