ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్సభ ఉపఎన్నికపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎం.గురుమూర్తి, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, అనిల్, పేర్నినాని, ఆదిమూలపు సురేష్ సహా పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు.
ఈ సమీక్ష సందర్భంగా ముందుగా అభ్యర్ధి గురుమూర్తిని సీఎం వైఎస్ జగన్ పార్టీ నేతలకు పరిచయం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలని నాయకులకు సూచించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా తిరుపతి ఫలితాలు ఉండాలని చెప్పారు. ఉపఎన్నికలో భాగంగా తిరుపతి లోక్సభ పరిధిలో ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా మంత్రి, ఎమ్మెల్యే ఉంటారని, నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ