ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ అక్టోబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ, రాష్ట్ర మంత్రులు, కీలక వైఎస్సార్సీపీ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయ లేఖ రాశారు.
“బద్వేలు నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అందరికీ నిండు మనసుతో హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉప ఎన్నికల సందర్భంగా, నా కుటుంబ సభ్యులైన మీతో బద్వేలు వచ్చి గడపాలని, ప్రత్యక్షంగా మిమ్మల్ని బహిరంగసభ ద్వారా ఓట్లు అడగాలని భావించాను. కానీ కోవిడ్ నిబంధనలు, ఎన్నికల కమిషన్ నిబంధనల నేపథ్యంలో నేను ప్రత్యక్షంగా బద్వేలు రాలేకపోతున్నా. మిమ్మల్ని అక్కడికి వచ్చి ఓటు అడగలేకపోతున్నా. నేను ప్రత్యక్షంగా అక్కడికి వస్తే, భారీగా మన అక్కచెల్లెమ్మలు ఒక్కసారిగా గుమికూడితే వారిలో ఏ కొందరికైనా కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వారి ఆరోగ్యాలను, వారి ప్రాణాలను, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకునే నా పర్యటన రద్దు చేసుకుంటున్నాను” అని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ బద్వేలు శాసనసభ ఉపఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాను గుర్తు మీదే ఓటు వేసి, పార్టీ అభ్యర్థి దాసరి సుధకు తిరుగులేని మెజార్టీతో అఖండ విజయం అందించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి దాసరి సుధను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టామని, గతంలో వెంకటసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో దాసరి సుధను గెలిపించాలని, పనిచేస్తున్న మనందరి ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరుకుంటున్నానని సీఎం వైఎస్ జగన్ లేఖలో కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలు, రైతన్నలు, విద్యారంగం సహా వివిధ వర్గాల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వివరాలను ఈ లేఖ ద్వారా సీఎం వైఎస్ జగన్ ప్రజల ముందు ఉంచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ