ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 12, మంగళవారం నాడు విజయవాడలో ఇసుక మార్చ్ నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. అదేవిధంగా నవంబర్ 13న పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని జిల్లాల్లో ఇసుక మార్చ్ నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టించిందని రామకృష్ణ విమర్శించారు. ఇసుక కొరత సమస్య వలన ఉపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర మంత్రులు మాత్రం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెలుగు ఉద్యోగుల తొలగింపు జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.
పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడ వెనక్కి తీసుకోవాలని రామకృష్ణ కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్కు సమాంతరంగా తెలుగు, ఉర్ధూ భాషల్లో కూడ బోధించాలన్నారు. కౌలు రైతులకు చేస్తున్న ఆందోళనకు కూడ సీపీఐ పార్టీ మద్ధతు ఇస్తుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబరు 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి తన గళాన్ని గట్టిగా వినిపించగా, బీజేపీ పార్టీ నాయకులు విజయవాడలో ఇసుక సత్యాగ్రహాన్ని నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడ భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా నవంబర్ 14, గురువారం నాడు ఇసుక కొరతపై ఒక రోజు దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
[subscribe]