ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు జనసేనలో సరైన నాయకులు లేరనే విమర్శలు వినిపించేవి. కానీ.. వారాహి యాత్ర తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. దీంతో విశాఖ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తాజాగా పవన్ను కలిసి జనసేన లో చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కడప, విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు ఇద్దరు పవన్తో కలిసి రాజకీయ ప్రయాణానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఆ ఇద్దరు టీడీపీకి అనుకూలంగా మారుతున్న సమయంలో అనూహ్యంగా వారి నిర్ణయం మారింది.
కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ఆయన పవన్ను కలవాలని డిసైడ్ అయ్యారని సమాచారం. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతు ప్రకటించిన డీఎల్ కొంతకాలంగా సీఎం జగన్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. డీఎల్ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఐతే.. తాను త్వరలోనే ఒక ప్రధాన పార్టీలో చేరుతానని డీఎల్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కడప జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల్లో డీఎల్ జనసేన వైపు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మైదుకూరు నుంచి ఆరుసార్లు డీఎల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా కూడా పని చేశారు. డీఎల్ తొలి నుంచి ఆసక్తిగా ఉన్న టీడీపీని కాదని ఇప్పుడు జనసేన వైపు చూస్తుండటం జిల్లాలో ఆసక్తి కరంగా మారుతోంది.
మరోవైపు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్లో సుదీర్ఘ కాలం పని చేశారు. ఇప్పుడు ఆయన కూడా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పవన్తో సమావేశం కానున్నారు. వైఎస్ కేబినెట్లో కొణతాల మంత్రిగా పనిచేశారు. 1989, 1991లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన కొణతాల.. 1994లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. వైఎస్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో జగన్కు అండగా నిలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంటు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన సోదరుడు రఘునాధ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014లో విజయమ్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. ఉత్తరాంధ్ర సమస్యల పైన పోరాటానికి సిద్ధమయ్యారు. మధ్యలో చంద్రబాబుకు దగ్గర అవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ నేతలు పవన్తో కలిసి రాజకీయంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించటం ఆసక్తికర పరిణామంగా మారుతోంది. టీడీపీతో జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలో.. అటు బీజేపీ పవన్ కేంద్రంగా రాజకీయం ప్రారంభించింది. ఇటు జనసేన వైపు సీనియర్ల చూపు మళ్లింది. దీంతో.. ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE