జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు గత 14 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ముందుగా మంగళగిరి మండలం నవులూరులో రైతుల చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రబాలెం చేరుకొని మహిళా రైతులతో సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో ఈ ప్రాంత రైతులు భూములు ఇవ్వలేదని, గొప్ప రాజధాని కోసం భూములు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం మారిపోతే అమరావతి భవితవ్యంపై గతంలోనే తాను ఆందోళన వ్యక్తం చేశానని అన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33 వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చినప్పుడు తనకు భయమేసిందని చెప్పారు. అమరావతి బాండ్లు రిలీజ్ చేసి, సీఆర్డీఏ పేరుతో చట్టం చేసిన తర్వాత కూడా అమరావతి భవిష్యత్తు ఇలా అంతుబట్టని రీతిగా మారడం దారుణమని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చాలా కష్టసాధ్యంగా మారిందని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోగొట్టుకున్న ఆంధ్ర ప్రజలకు ఇప్పుడు కావాల్సింది కేవలం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాదని, ఒక పూర్తిస్థాయి రాజధాని నగరం కావాలని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నగరాన్ని నిర్మించాలంటే దశాబ్దాల సమయం పడుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ తో పాటుగా, జనసేన పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
[subscribe]