ఏపీలో అధికార వైసీపీలో అసమ్మతి సెగ భగ్గుమంటోంది. ముఖ్యంగా సిట్టింగ్లను మార్చడం.. కొందరిని వేరే స్థానానికి పంపించడంతో.. వైసీపీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే కొందరు నేతలు అసంతృప్తితో ఉండలేక వైసీపీకి రాజీనామా చేసేశారు. మరికొంత మంది కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారిని కాపాడుకునేందుకు.. వారిని సంతృప్తి పరిచేందుకు వైసీపీ ఓవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలోకి రాగానే తగిన ప్రధాన్యత ఇచ్చి మంచి పదవులు కట్టబెడుతామని వారిని సంతృప్తి పరిచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో వైసీపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మరో కీలక నేత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అవును.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని.. దానికి తాను బాధ్యుడిని కాదని శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. తన స్థానంలో కొత్త వారిని బరిలోకి దింపేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తోందని.. తనను గుంటూరు నుంచి పోటీ చేయించేందుకు సిద్ధమవుతోందిని.. దీని వల్ల నరసరావుపేటలో కేడర్ అయోమయంలో పడిపోయిందని వెల్లడించారు. అందువల్లే తాను వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రస్తుతం శ్రీకృష్ణదేవరాయలు తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే లావు శ్రీకృష్ణదేవరాయులు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరుపున నరసారావుపేట నుంచి పోటీ చేసి ఆయన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై శ్రీకృష్ణదేవరాయలు 153978 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈసారి ఇంఛార్జ్ల మార్పులో భాగంగా నరసరావు పేట నుంచి శ్రీకృష్ణదేవరాయులుకు బదులుగా.. బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాగార్జునను పోటీ చేయించాలని ఆలోచన చేస్తోంది.
అదే సమయంలో శ్రీకృష్ణదేవరాయలును ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది. ఇదే విషయంపై హైకమాండ్ శ్రీకృష్ణ దేవరాయలుతో చర్చలు కూడా జరిపింది. అయితే గుంటూరు నుంచి పోటీ చేయడం ఇష్టంలేని శ్రీకృష్ణదేవరాయులు అప్పటి నుంచి అసంతృప్తిగా ఉంటున్నారు. అలాగే తాను నరసారావుపేట నుంచే పోటీ చేస్తానని తేల్చి చెబుతున్నారు. అటు నరసారావు పేట లోక్ సభ నియోజకవర్గం కిందకు వచ్చే కొందరు ఎమ్మెల్యేలు, పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా నరసారావుపేట నుంచే శ్రీకృష్ణదేవరాయులను పోటీ చేయించాలని హైకమాండ్ను కోరుతున్నారు.
ఈక్రమంలో శ్రీకృష్ణదేవరాయులు ఎక్కడి నుంచి పోటీ చేస్తే మంచిది అనే దానిపై హైకమాండ్ మరోసారి పునరాలోచన చేస్తోందట. అక్కడి స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో చర్చలు జరుపుతోందట. త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోనుందట. అయితే హైకమాండ్ పునరాలోచన చేస్తున్న సమయంలో శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE