రాజధాని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయాలు రసకందంగా మారాయి. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్గా ముద్ర పడ్డ పి.జనార్దన్రెడ్డి కుమారుడు ఆ పార్టీని వీడి అధికార పార్టీ బీఆర్ఎస్లో చేరుతుండడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. తాజాగా నిన్న సాయంత్రం మంత్రి హరీశ్రావుతో కూడా భేటీ అయ్యారు. ఆ వెంటనే ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్తోనూ సమావేశం అయ్యారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే.. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ను ఓడించడమే విష్ణువర్ధన్రెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది.
తుది శ్వాస వరకూ కాంగ్రెస్లోనే కొనసాగిన నేత పి. జనార్దన్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఆయన ఆకస్మిక మృతి అనంతరం కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి 2008 ఉప ఎన్నిక, 2009లో వరుసగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2018లో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అధిష్ఠానం నియోజకవర్గంలో ఉన్న 1.05 లక్షల మైనారిటీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు టికెట్ ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో విష్ణువర్ధన్రెడ్డి తీవ్రంగా నొచ్చుకున్నారు.
రెండు రోజులుగా కార్యకర్తలు, అనుచరులతో సమాలోచన చేసిన పీవీఆర్ చివరకు బీఆర్ఎ్సలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ను కలవడంతోపాటు విష్ణు నివాసానికి మంత్రి హరీష్ రావు రావడంతో చేరికలో ఉన్న అపోహలు తొలగిపోయాయి. విష్ణు వెంట భారీగా నాయకులు బీఆర్ఎ్సలోకి వెళతారననే ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్లో పీజేఆర్ వర్గం ఓట్లే కాంగ్రె్సకు కీలకం. ఎల్లారెడ్డిగూడ, రెహ్మత్నగర్, యూసు్ఫగూడ, బోరబండ, ఎర్రగడ్డలో పీజేఆర్ వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఎటువంటి ఎన్నికలు వచ్చినా ఈ ఓటర్లు మాత్రం కాంగ్రెస్తోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు విష్ణు పార్టీ మారడంతో పీజేఆర్ వర్గం ఓటర్లు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది. విష్ణు నిర్ణయం కాంగ్రె్సను కూడా కలవర పెట్టడంతో నష్ట నివారణకు సీనియర్ నాయకులు, గ్రేటర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రంగంలోకి దిగారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ వీడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే విష్ణు మాత్రం కాంగ్రెస్ ఓటమికి కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. కరుడుగట్టిన కాంగ్రెస్ నేత కుమారుడు ఇప్పుడు అదే పార్టీ ఓటమి కోసం వేరొక పార్టీతో జతకట్టడం రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఎన్నికల సమరం మొదలయ్యాక రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ