జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా నాయకుల అరెస్టు, ఆంక్షలు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంఘీభావం తెలిపిన ప్రజా నేతలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఎటువంటి అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారని, ఈ చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారని, ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టి, పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులను ఖండించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫోన్లో సంభాషించి, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారని, జనసేన పార్టీ నాయకుల అరెస్టులను ఖండించారని చెప్పారు. మద్దతుగా నిలిచిన సోము వీర్రాజుకు, బీజేపీ జాతీయ కార్యదర్శులు సునీల్ దేవధర్, సత్య కుమార్ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
“బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కలిసి సంఘీభావం తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా చేసిన అతి పోకడలను ఖండించినందుకు వారికి నా కృతజ్ఞతలు. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డా.జయప్రకాష్ నారాయణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను ఖండించారు. వారికి ధన్యవాదాలు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విశాఖలో చోటు చేసుకున్న ఘటనను, ప్రభుత్వ ధోరణిని తప్పుబట్టినందుకు కృతజ్ఞతలు. ఈ చర్యలను ఖండించి ప్రజాస్వామ్య విధానాలను సమర్ధించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. జనసేన పార్టీ నాయకులు విశాఖలో ప్రభుత్వ పెడ ధోరణులను నిరసిస్తూ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టారు. పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న పార్టీ నేతలు, వీరమహిళలు, జన సైనికులకు అభినందనలు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY