ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ, జనసేనల పొత్తు ఖరారయిన వార్త తెలియగానే వెంటనే వైసీపీ అలర్ట్ అయింది. కాపులను తమ వైపు తిప్పుకోవడానికి ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకోవడానికి అధికార వైసీపీ ఎంతగానో ప్రయత్నించింది. ముద్రగడ కూడా నేడో, రేపో కుమారుడితో కలిసి వైసీపీలో చేరిపోవడానికి సిద్ధమయ్యారనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి.
తాజాగా ముద్రగడ పద్మనాభంను తమ వైపు తిప్పుకోవడానికి జనసేన రంగంలోకి దిగడంతో.. గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయి సరికొత్త రాజకీయ పరిణామాలకు తెరలేపినట్లు అయింది. ముద్రగడ కనుక జనసేనలో చేరితే..వైసీపీకి బలంగా చెక్ పెట్టొచ్చన్న లెక్కలు తెరమీదకు వచ్చాయి.
అంతేకాదు ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన కూటమికి తిరుగుండదనే నమ్మకంతో రెండు పార్టీల నేతలు ఉన్నారు . దీనలో భాగంగానే కొంతమంది జనసేన నేతలు కిర్లంపూడిలో ఆయనను కలిసి చర్చలు కూడా జరిపారు. అయితే, పవన్ కళ్యాణ్ ఇచ్చిన లేఖను ముద్రగడకు అందించామని జనసేన నేతలు తెలిపారు.
జనసేనతో పాటు కొంతమంది తెలుగు దేశం నేతలు కూడా ముద్రగడ పద్మనాభంను కలిశారు. ముద్రగడను కలిసిన టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ..ముద్రగడ మళ్లీ రాజకీయాల్లో వస్తే ఆయనను ఆహ్వానిస్తామని అన్నారు. రాజకీయంగా తన కోసం మాత్రమే వచ్చానని చెప్పిన జ్యోతుల నెహ్రూ.. టీడీపీ అధిష్టానం తనకు చెప్పలేదని అన్నారు. ఇది తన వ్యక్తిగతమే తప్ప.. పార్టీకి సంబంధించిన విషయం కాదని చెప్పుకొచ్చారు. కానీ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని ముద్రగడ తమకు చెప్పలేదని అన్నారు.
మరోవైపు తనను కలిసేందుకు వచ్చిన అన్ని పార్టీల నేతలను అప్యాయంగా పలకరిస్తూ ..మాట్లాడి పంపిస్తున్న ముద్రగడ పద్మనాభం మాత్రం ఇప్పటికీ తన మనసులో ఏముందనే విషయాన్ని బయటపెట్టడం లేదు. కొడుకుతో పాటు ఏదొక రాజకీయపార్టీలో ఆయన త్వరలోనే చేరతారని.. కాకపోతే అది ఏ పార్టీనో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE